రవీంద్రభారతి, జూలై 10 : రాష్ట్రంలో అణగారిన వర్గాల భాషలను పరిరక్షించాలని పలువురు వక్తలు కోరారు. తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్పర్సన్గా నియమితులైన మంత్రి శ్రీదేవి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ వేదికలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గ్రంథాలయ సంస్థల చైర్మన్ అయాచితం శ్రీధర్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూ లూరి గౌరీశంకర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ హాజరయ్యారు. అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల భాష అధికార భాష స్థాయిలో పటిష్ఠం కావాలని చెప్పారు. తెలంగాణ భాషను పరిరక్షించడానికి తమిళనాడు వెళ్ళి అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు.
తెలంగాణ నిఘంటువును తయారు చేయాలని కోరారు. జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా మొట్టమొదటిసారిగా మహిళను నియమించడం శుభపరిణామమన్నారు. మామి డి హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారిణి, సోషల్ మీడియాలో చురుకుగా పనిచేస్తున్న మంత్రి శ్రీదేవికి అధికార భాషా సంఘం చైర్పర్సన్గా ఇవ్వడం అభినందనీయమన్నారు. శ్రీదేవి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు. తెలంగాణ భాష అభివృద్ధి కోసం మాజీ ప్రధాని పీవీ కృషిచేశారని గుర్తుచేశారు. భాషకోసం కవులు, కళాకారులు సమిష్టిగా కలిసి రావాలని కోరారు. రాష్ర్టాల్లో పర్యటించి భాషాభివృద్ధి గురించి తెలుసుకొంటానని చెప్పారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు ఉపేందర్, పీ నాగేందర్, రవీందర్రావు, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు.