Manne Krishank | హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారని ఒక పత్రిక రాస్తే దాని మీద కేసు వేశారు.. అక్రమ భూదందా గురించి మాట్లాడితే నా మీద కేసు వేసి, నా ఫోన్ సీజ్ చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తెలిపారు. ఈ కేసులు వేసింది కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడే అని పేర్కొన్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
చిత్రపురి సిటీ భూదందాపై పోస్టు చేసినందుకు నా ఫోన్ను మాదాపూర్ పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన మొబైల్ ఫోన్ను కోర్టులో డిపాజిట్ చేయాలని కోరుతున్నాం. మొబైల్ ఫోన్లు సీజ్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారు..? ఇదేక్కడి సంస్కృతి..? అని క్రిశాంక్ ప్రశ్నించారు. గతంలో రాష్ట్రంలో ఎవరెవరో ఏది చేసినా.. ప్రతిదాన్ని కేసీఆర్కు ముడిపెట్టారు కదా..? మరి ఇవాళ రేవంత్ రెడ్డితో ఫొటో దిగిన అనుముల మహానందరెడ్డిపై కూడా విచారణ చేయాలని కోరుతున్నామన్నారు.
మొబైల్ ఫోన్లు సీజ్ చేస్తామంటే.. రేపటి రోజున జర్నలిస్టులు కూడా ఎన్నో వార్తలు రాస్తారు.. వారి ఫోన్లు కూడా సీజ్ చేస్తారా..? ఇది చిన్న విషయం కాదు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ కేసులు వేశారు. మొన్న బేగంపేట ఎయిర్పోర్టులో రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశమైనట్లు ఒక పత్రిక రాసింది. ఆ పత్రిక మీద కేసు వేసింది కూడా మహేశ్ గౌడే. అంటే రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే.. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్చే పోలీసులకు ఫిర్యాదు చేయిస్తున్నారు. చంద్రబాబుతో రేవంత్ సమావేశం గురించి క్లారిఫికేషన్ ఇచ్చుకోకుండా కేసులు వేశారు. గాంధీ భవన్ వర్గాలు లేదా ప్రభుత్వం వర్గాలు వివరణ ఇవ్వాల్సింది పోయి న్యూస్ పేపర్ మీద కేసు వేస్తారా…? ఇవాళ కూడా నాపై కేసు వేసి ఫోన్ సీజ్ చేయించింది కూడా మహేశ్ గౌడే. రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఇదంతా జరుగుతోంది. ఇవాళ ఒక పత్రిక మీద కేసు వేశారు. రేపు ఇంకో పత్రిక మీద వేస్తారు. ఇవాళ ఒక పార్టీ మీద దాడి.. రేపు మరో పార్టీపై దాడి జరగొచ్చు. ఇదేనా ప్రజా పాలన అని మన్నె క్రిశాంక్ నిలదీశారు.