హైదరాబాద్, మే10 (నమస్తే తెలంగాణ)/ దుండిగల్: టీఎస్ ఆర్టీసీ కార్గోలో మ్యాంగోఎక్స్ప్రెస్ సర్వీసును ఆ సంస్థ ఎండీ సీవీ సజ్జనార్ మంగళవారం ప్రారంభించారు. జగిత్యాల నుంచి ఆన్లైన్లో బంగినపల్లి మామిడి పండ్లను బుక్ చేసుకొన్న నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి, బాచుపల్లి కౌసల్యకాలనీలోని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కిరణ్, హేమ దంపతులకు సజ్జనార్ తొ లి మ్యాంగో ఎక్స్ప్రెస్ ప్యాక్ను అందజేశారు. మ్యాంగోఎక్స్ప్రెస్ ద్వారా ఇప్పటి వరకు 12 వేల మందికిపైగా బుక్ చేసుకున్నారని సజ్జనార్ తెలిపారు. www. tsrtcparcel.com వైబ్సైట్లో మామిడి పండ్లను బుక్ చేసుకొంటే నాలుగైదు రోజుల్లోనే డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు. 5 కిలోల మామిడి పండ్లు రవాణా చార్జీలతో కలిపి రూ.581కే అందజేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ సీనియర్ రీజనల్ మేనేజర్ వెంకన్న, డిప్యూటీ సీటీఎం జగన్, మియాపూర్ డిపో-1 మేనేజర్ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీలో ఎలాంటి వేధింపులు లేవు: ఎండీ
టీఎస్ ఆర్టీసీలో సిబ్బందిపై ఎలాంటి వేధింపులు లేవని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టంచేశారు. ‘ఆర్టీసీలో పరాకాష్టకు చేరిన వేధింపులు’ అనే శీర్షికతో మంగళవారం ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ఖండించారు. వార్తలో వేధింపుల పర్వం పూర్తి నిరాధారమని పేర్కొన్నారు. సంస్థ విధివిధానాలు, లక్ష్యాలకు ఇది పూర్తి విరుద్ధమన్నారు. కేఎంపీఎల్ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైన డ్రైవర్ల జీతంలో కోత విధించాలని యాజమాన్యం ప్రతిపాదిస్తున్నట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. తమ సంస్థకు ఉద్యోగుల సంక్షే మం, సామర్థ్యం రెండూ ముఖ్యమేనని స్పష్టంచేశారు. ‘ఆర్టీసీలో ఇంధన మంట’ వార్తను సైతం ఆయన ఖం డించారు. ఇంధన పొదుపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లకు పారితోషికంతోపాటు అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. కొందరు కావాలనే ఆర్టీసీపై అసత్య ఆరోపణలు చేస్తూ సంస్థకు చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.