మంచిర్యాల, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటే ఏం తెస్తారు? మళ్లీ ఇంద్రవెల్లి కాల్పు లు తెస్తారా? మరోసారి ఎమర్జెన్సీ తెస్తారా? అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆదివా రం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అధ్యక్షతన ఆయన స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో సానుభూతి రావాలనే ఇందిరమ్మ పేరు వాడుకుంటున్నారని ధ్వజమెత్తా రు. దేశంలో ఇందిరమ్మ దాదాపు 17 ఏండ్లు రాజ్యం చేసినంక కూడా పేదరికం ఎందుకు ఉందో చెప్పాలని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం గొప్పగా ఉంటే ఆమె మనుమడు రాహుల్గాంధీ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని డిమాండ్చేశారు.
గద్దర్ సహచరులను చంపిందెవరు?
ఇంద్రవెల్లి సభలో గద్దర్ గజ్జ కట్టి పాటపాడితే ఆయన సహచరులను కాల్చి చంపిన కాంగ్రెస్ సర్కారు, ఇవాళ మళ్లీ అక్కడ స్థూపం కడతామనడం సిగ్గుచేటని నిరంజర్రెడ్డి దుయ్యబట్టారు. ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం ఉంటుందా? ఎక్కడైనా హంతుకులే సంతాపం ప్రకటిస్తారా? అని ప్రశ్నించారు. ఆఖరి రోజుల్లో గద్దర్ తన సిద్ధాంతాలను మార్చుకొని ఉండొచ్చు కానీ, ఆయన ఏ వర్గాలకు ప్రతినిధిగా ఆనాడు పోరాటం చేశారో ఆలోచించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 16 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే, ప్రగతిభవన్ ముందు ఆటోను కాలబెట్టి నిరసన తెలిపితే, ఏ ఒక్క మీడియా దాన్ని చూపించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘కేసీఆర్ మా ప్రభుత్వాన్ని పడగొడుతారంట.. వీళ్లు పడగొడుతారంట.. వాళ్లు పడగొడుతారంట’ అని భుజాలు ఎందుకు సరుసుకుంటున్నరో అర్థం కావడం లేదన్నారు. మిమ్ములను బొంద పెట్టడానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలే సరిపోతాయని చురకలు అంటించారు. రెండు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల నుంచి ఛీత్కారాలు వస్తున్నాయని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ తదితరులు పాల్గొన్నారు.