యాచారం, మే 5: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రేవంత్రెడ్డి సర్కార్ ప్రజాసమస్యలను, ఇచ్చిన హామీలను విస్మరించిందని జనగామ మాజీ ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లా యాచారం, మంచాల మండలాల్లో భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్కు మద్దతుగా ఆదివారం రోడ్షో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. కేసీఆర్పై, బీఆర్ఎస్పై అసభ్యకరంగా మాట్లాడితే తమ పార్టీ కార్యకర్తలు తరిమికొట్టే రోజులోస్తాయని చెప్పారు. కొంత మంది పార్టీని వీడినంత మాత్రాన బీఆర్ఎస్కు ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. త్వరలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. భువనగిరి ఎంపీగా తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని అభ్యర్థి క్యామ మల్లేశ్ హామీ ఇచ్చారు.