మంచిర్యాల, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చినోళ్లు, ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత పార్టీలో చేరినోళ్లు వేదికల మీద కూర్చొని పార్టీలో ముందు నుంచి ఉన్నోళ్లపై పెత్తనం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతకదని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు వ్యాఖ్యానించారు. ఇప్పుడు వచ్చినోళ్లు ఎవరైనా పార్టీ మీద ప్రేమతో, పార్టీ కోసం పనిచేసేందుకు రాలేదని దుయ్యబట్టారు. అధికారం ఉన్నదనే వచ్చారని, రేపు అధికార మార్పిడి జరిగితే వచ్చినోళ్లు ఎవ్వరూ ఉండరని చెప్పారు. ఎవరైతే పదిహేను, ఇరువై ఏండ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్నారో వాళ్లే ఉంటారని, వాళ్లే పని చేస్తారని పేర్కొన్నారు. మంచిర్యాలలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో శుక్రవారం మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ హాజరైన ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ తదతరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారి సమక్ష్యంలోనే ప్రేమ్సాగర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వేరు.. పార్టీ వేరు అని, పార్టీ కార్యవర్గంలో ముందు నుంచి కష్టపడిన వాళ్లకు గుర్తింపు ఇవ్వాలని సూచించారు. గత పది, ఇరవై ఏండ్లుగా జెండా పట్టి తిరిగిన వాళ్లకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఎవరూ పార్టీ కోసం పనిచేయరని హెచ్చరించారు. మంత్రి పదవి రాలేదన్న అసహనంతోనే పీఎస్ఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం జరుగుతున్నది. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ.. అన్ని పార్టీల్లో గ్రూపులు ఉంటాయని, కాంగ్రెస్లో కూడా ఉన్నాయని చెప్పారు. మంత్రి పదవి విషయంలో వచ్చిన బేధాభిప్రాయాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇద్దరు నేతలు డీసీసీ మీటింగ్లో మాట్లాడిన తీరు మరోసారి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలోని లుకలుకలను బయటపెట్టింది.
ఎమ్మెల్యేతో తగాదాల వల్లనే జీవన్రెడ్డి పార్టీ మారారు : మహేశ్కుమార్
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యేతో తగాదాల కారణంగానే పార్టీ మారారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు. మంచిర్యాలలో వీడియాతో మాట్లాడా రు. జగిత్యాలలో జీవన్రెడ్డి, నిజామాబాద్లో సంజయ్ పార్టీలు మారుతున్నారని, దీనిపై మీ రు ఏమంటారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. జీవన్రెడ్డికి స్థానిక ఎమ్మెల్యేతో తగాదాలు ఉండి పార్టీ మారారని చెప్పారు. ఆయనకు ప్రభుత్వం చాలా అవకాశాలు ఇచ్చిందని, తాను సముదాయించే ప్రయత్నం చేశానని చెప్పారు.
ఆరు గ్యారెంటీలు అందడం లేదు : రొడ్డ శారద
ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందడం లేదని కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ రొడ్డ శారద పేర్కొన్నారు. తాను మున్సిపల్ ఎన్నికల్లో తిరిగినప్పుడు గ్యాస్ సబ్సిడీ పైసలు పడటం లేదని చాలామంది తనతో చెప్పారని వివరించారు. కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ తప్పితే రాష్ట్రం నుంచి ఎలాంటి సబ్సిడీ రావాడం లేదని ప్రజలు చెప్తున్నారని తెలిపారు. ఈ విషయంపై పార్టీ, ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.