హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీని వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు దేశంలోనే తొలిసారి సెన్సర్ విధానాన్ని అమలు చేయనున్నది. ఇప్పటికే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 10 టాయిలెట్లలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రమంతటా అమలు చేయాలని మున్సిపల్శాఖ నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని అన్ని పబ్లిక్ టాయిలెట్లలో సెన్సర్లను అమర్చి రియల్ టైం పద్ధతిలో వాటిని పర్యవేక్షించనున్నారు.
ఆయా మరుగుదొడ్లను రోజూ ఎంతమంది ఉపయోగించుకొంటున్నారు? నీరు సక్రమంగా సరఫరా అవుతున్నదా? లేదా? ఎగ్జాస్ట్ ఫ్యాన్లు సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అక్కడ దుర్వాసన ఏమైనా వస్తున్నదా? అనే సమాచారాన్ని సెన్సర్లు నిరంతరం సంబంధిత మున్సిపల్ కార్యాలయానికి, సీడీఎంఏ కార్యాలయానికి చేరవేస్తాయి. దీని ఆధారంగా సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు చేపడతారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రతి 5 వేల మందికి ఒకటి చొప్పున మరుగుదొడ్లను నిర్మించగా.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డిని నిర్మించింది. జీహెచ్ఎంసీతోపాటు ఇతర కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో కొత్తగా 4,118 టాయిలెట్లను నిర్మించడంతో మొత్తంగా 9,088 మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి నిర్వహణ సరిగా లేదని ఆరోపణలు రావడంతో పట్టణ ప్రగతి టాయిలెట్ మానిటరింగ్ సిస్టం (పీపీటీఎంస్)ను ప్రవేశపెట్టింది. ఈ విధానం అద్భుత ఫలితాలను ఇవ్వడంతో కేంద్రం గతంలో అవార్డును ప్రకటించింది.