హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : బాల సాహిత్యంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే మాడల్ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పాఠశాలల్లో చదివే ఐదు లక్షల మంది విద్యార్థులు ఒకేసారి తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ‘మన ఊరు మన చెట్టు’ అనే అంశంపై పల్లెల్లోని పచ్చదనానికి అక్షరరూపం ఇవ్వడం గొప్ప విషయమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన విద్యార్థులు రాసిన కథలను 33 పుస్తకాలుగా తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించింది.
ఈ పుస్తకాలను విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి సచివాలయంలోని తన కార్యాలయంలో మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బాల సాహిత్యాన్ని ముద్రించడం గర్వకారణమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ విద్యార్థులు కలం పట్టి తమ ఊరి ప్రకృతిని అద్భుతంగా కథలుగా మలిచి దేశానికే మాడల్గా నిలిచారని మంత్రి సబిత ప్రశంసించారు.
ఈ బాల కథల రచనల్లో పాల్గొన్న విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప కవులుగా, రచయితలుగా, పర్యావరణ పరిరక్షకులుగా తయారవుతారని ఆకాంక్షించారు. ఈ కథల పుస్తకాలను రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు అందిస్తామని వెల్లడించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ చేసిన కృషిని మంత్రి సబిత అభినందించారు. ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ను మంత్రి శాలువాతో సన్మానించారు.
కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, తెలంగాణ విద్యా మౌలిక వసతుల సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, ప్రొఫెసర్ నారా కిశోర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు తదితరులు పాల్గొన్నారు.
దసరా నుంచి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీం అమలు
దసరా నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఇది విద్యార్థులకు పౌష్టికాహారాన్నందించే అద్భుత పథకమని అన్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు, మంచి పోషకాహారాన్ని అందించడమే ఈ పథకం ఉద్దేశమని పేర్కొన్నారు. ఒకటోతరగతి నుంచి పదోతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ స్కీం కింద అల్పాహారాన్ని ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు.
త్వరితగతిన మెనూను రూపొందించి, విధి విధానాలను తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా 27,147 పాఠశాలల్లోని దాదాపు 23లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని అన్నా రు. ఈ పథకం విజయవంతానికి ప్రభుత్వశాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.