కుమ్రం భీం ఆసిఫాబాద్ : విద్యార్థుల బంగారు భవిష్యత్తే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శుక్రవారం మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ సంచాలకులు దేవసేన, పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్తో కలిసి ఆయన జిల్లాలో పర్యటించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. పాఠశాల భవనం, గదులు, మూత్రశాలలు వంటి వాటిని అధునాతనంగా మార్పు చేసి పిల్లలకు సౌకర్యవంతంగా వుండే విధంగా చూడాలని అన్నారు.
పూర్వ విద్యార్థులు పాఠశాలలకు విరాళాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారని, ఈ తరుణంలో అధికారులకు తాము చదివిన పాఠశాలలను బాగు చేసుకోవడం మంచి అవకాశమని, అందరు సమిష్టిగా పని చేయాలని అన్నారు. పంచాయతీ రాజ్ శాఖ వారు అవసరమైన వాటికి అంచనా ప్రతిపాదనలు తయారు చేసి ఎక్కడైతే సమస్యలుంటాయో అక్కడే నిధులు వినియోగించుకోవాలని సూచించారు.
అలాగే రెబ్బెన మండలంలోని కొండపల్లి గ్రామాన్ని సందర్శించిన సమయంలో రహదారి, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించానని, చాలా చోట్ల సీసీ రోడ్లు, మురుగు కాలువలు లేవన్నారు. అలాగే గ్రామ పంచాయతీ వారు ప్రతి రోజు రహదారుల, మురుగు కాలువలు శుభ్రపరచాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాలను ప్రతిరోజు సాయంత్రం వేళలో అధికారులు సందర్శించి శ్రద్ధతో వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతి రోజు ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చి విక్రయించాలని, ప్రతి రోజు గ్రామ పంచాయతీ సిబ్బంది 100 శాతం హాజరయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, వరుణ్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.