ఒకే క్యాంపస్లోని స్కూళ్లతోపాటు కాలేజీల అభివృద్ధి
సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రభుత్వం
ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్న అధికారులు
అదనపు నిధులు సమకూర్చేందుకు అనుమతి
హైదరాబాద్, ఫిబ్రవరి 5 : ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించి అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు చేపట్టిన మన ఊరు- మన బడి పథకంలోకి జూనియర్ కాలేజీలను కూడా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. స్కూళ్లల్లో నడుస్తున్న జూనియర్ కాలేజీలను ఈ పథకంలో భాగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. స్కూళ్ల తరహాలోనే 12 అంశాల్లో కాలేజీల తరగతి గదులు, భవనాలకు హంగులు అద్దనున్నారు. 12వ అంశమైన డిజిటల్ విద్యను మాత్రం కాలేజీల నుంచి మినహాయించనున్నట్టు సమాచారం. కాలేజీల్లో వసతులు కల్పనకు అవసరమైన అదనపు బడ్జెట్ను అందించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిసింది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా, వాటిల్లో 25 వరకు సర్కారు స్కూళ్లల్లో నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీలను మన ఊరు మన బడి పథకంలో భాగం చేయనున్నారు. హైదరాబాద్ బోరబండలోని నాట్కో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో బోరబండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నడుస్తున్నది. రాష్ట్రంలోనే అత్యధిక ఎన్రోల్మెంట్ ఉన్న ఈ పాఠశాలను మన బస్తీ – మన బడి పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తారు. ఇక్కడ మొత్తం 38 గదులుండగా, 34 గదుల్లో పాఠశాల, 4 గదుల్లో జూనియర్ కాలేజీని నడుపుతున్నారు. ఈ పథకంలో భాగంగా కాలేజీకి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ఒకే క్యాంపస్లో నడుస్తున్న ఇతర కాలేజీలను కూడా ఇదే విధంగా అభివృద్ధి చేస్తారు.
ఎస్ఎంసీలకు శిక్షణ
ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలుచేసే బాధ్యతలను పాఠశాల నిర్వహణ కమిటీల (ఎస్ఎంసీ)కు అప్పగించిన విషయం తెలిసిందే. త్వరలోనే పథకం అధికారికంగా ప్రారంభం కానుండటం తో ఎస్ఎంసీలకు శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. తొలివిడతలో ఎంపికచేసిన పాఠశాలల ఎస్ఎంసీలకు శిక్షణఇస్తారు. సివిల్ వర్క్స్, మరమ్మతులు, పెయింటింగ్ వంటి పనులు చేపట్టేందుకు కాం ట్రాక్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, బిల్లులు, చె క్కుల జారీ, దాతలు, సీఎస్సార్ నిధుల సేకరణ వంటి అంశాలపై ఎస్ఎంసీలకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఒకే ప్రాంగణంలో ఉంటే అన్నింటికీ వర్తింపు
ఈ పథకంలో భాగంగా స్కూళ్ల ఎంపిక ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. మండలం యూనిట్ గా అత్యధిక ఎన్రోల్మెంట్ నమోదైన స్కూళ్లను ముందుగా ఎంపిక చేస్తున్నారు. ఒకే ప్రాంగణంలో నడిచే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఒకే దఫాలో అభివృద్ధికి ఎంపికచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ లెక్కన ఒకే ప్రాంగణంలో గల ప్రాథమిక పాఠశాలలో ఎన్రోల్మెంట్ తక్కువ ఉండి, ఉన్నత పాఠశాలలో ఎక్కువుంటే, ప్రాథమిక పాఠశాల భవనం, తరగతి గదులను సైతం ఈ పథకంలో చేర్చుతారు. ఈ పథకంపై 9వ తేదీన విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్, సమగ్రశిక్ష అభియాన్, విద్యాశాఖల అధికారులు పాల్గొంటారు.