నెక్కొండ, జూ న్ 24: ఆన్లైన్ గేమ్ లో వడ్ల డబ్బులు పోగొట్టిన ఓ యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేటలో జరిగింది. అప్పల్రావుపేటకు చెందిన బాషబోయిన కమలాకర్ బ్యాంక్ ఖాతాలో ఇటీవల వరి ధాన్యం అమ్మిన డబ్బులు రూ.46 వేలు జమ అయ్యాయి. ఆ డబ్బులతో కమలాకర్ రెండో కుమారుడు ఉదయ్ (20) శుక్రవారం రాత్రి ఆన్లైన్ గేమ్ ఆడాడు.
తండ్రి ఖాతాలో పడిన వడ్ల డబ్బులు మొత్తం రూ.46 వేలు పోగొట్టాడు. తల్లిదండ్రులు మందలిస్తారన్న భయం తో ఉదయ్ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం తండ్రి కమలాకర్ లేచి చూసే సరికి ఉదయ్ చనిపోయాడు. కమలాకర్ అందించిన సమాచారంతో ఎస్సై జాన్బాష సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.