Sangareddy | సంగారెడ్డి : పోలీసులను ఓ యువకుడు ఫోటోలు తీశాడు. ఎందుకు ఫోటోలు తీస్తున్నావని ప్రశ్నించి, ఫోన్ సీజ్ చేయగా.. ఆ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి జంక్షన్లో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజంపేట ఏరియాకు చెందిన సంతోష్(37) అనే వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్నాడు. పోతిరెడ్డిపల్లి జంక్షన్ వద్ద బస్సు దిగాడు. అక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను ఫోటో తీశాడు. సంతోష్ను గమనించిన పోలీసులు.. ఎందుకు ఫోటోలు తీస్తున్నావని ప్రశ్నించారు. ఈ క్రమంలో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి పెట్రోల్ కొనుగోలు చేశాడు. అనంతరం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు మంటలను ఆర్పేసి, సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంతోష్ 50 శాతం కాలిన గాయాలయ్యాని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.