రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
కిమ్స్ దవాఖానలో విజయవంతంగా శస్త్రచికిత్స
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ)/బేగంపేట: రోడ్డు ప్రమాదంలో డయాఫ్రమ్ (ఊపిరితిత్తులు, ఉదరభాగానికి మధ్య గోడలా ఉన్న భాగం) దెబ్బతిన్న ఓ యువకుడికి(26) కిమ్స్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. బైక్పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురవటంతో యువకుడి ఉదరంలోని అవయవాలు పక్కకు జరిగాయి. డయాఫ్రమ్ 7సెంటీమీటర్ల మేర దెబ్బతిన్నది. దీంతో రోగికి శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారింది.
నల్లగొండ జిల్లాలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతుండగా పరిస్థితి మరింత విషమించింది. దీంతో అతడిని సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి డయాఫ్రమ్తో పాటు, కాలేయం కూడా దెబ్బతిన్నదని గుర్తించారు. ఇలాంటి సందర్భాల్లో శస్త్రచికిత్స చేయటం సవాలు అని తెలిసినా, లాప్రోస్కోపిక్ పద్ధతిలో అవయవాలను యథాస్థానంలోకి తీసుకొచ్చి, దెబ్బతిన్న డయాఫ్రమ్ చోట ఖాళీని పూడ్చారు. సాధారణంగా ఎంతటి ప్రమాదం జరిగినా డయాఫ్రమ్ దెబ్బతినటం అరుదు అని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ సచిన్ డాగా తెలిపారు. శస్త్రచికిత్స చేసిన నాలుగో రోజునే ఆ యువకుడిని డిశ్చార్జి చేశామని, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని పేర్కొన్నారు.