చార్మినార్, మార్చి 25: సైకిల్ పై వేల కిలోమీటర్లు ప్రయాణించాలంటే సాధ్యమేనా అనే అనుమానం రాకమానదు. కానీ భక్తితో కూడిన ఇష్టం ముందు ఎంతటి సమస్య అయినా చిన్నదిగానే కనిపిస్తుంది అంటారు ఓ భక్తుడు. తన ఇష్టదైవాన్ని సందర్శించడానికి వేల కిలోమీటర్ల దూరం సైతం చిన్నబోయే తన్మయత్వంతో నిర్ణయాన్ని వెల్లడించారు. ఒరిస్సాకు చెందిన షేక్ వసీం (54) సౌదీ అరేబియాలోని మక్కాను సందర్శించడానికి సైకిల్పై బయలుదేరారు. శుక్రవారం చార్మినార్ మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు ముగించుకున్న అనంతరం వసీం సైకిల్పై మక్కా మదీనాకు ప్రయాణమయ్యాడు. సుమారు నెల రోజులలో 3,800 కిలోమీటర్ల ఈ ప్రయాణాన్ని పూర్తిగా సైకిల్పైనే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వసీం తెలిపారు. వసీం విజయవంతంగా యాత్రను ముగించాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.