నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. భార్య మటన్ వండమంటే నిరాకరించిందనే కోపంతో ఓ భర్త ఊగిపోయాడు. అతడి ఆవేశానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే జేబులో ఉన్న ఫోన్ తీసి డయల్ 100కు రింగ్ ఇచ్చాడు. అతడి ఫిర్యాదు విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు.
నల్లగొండ జిల్లా కనగల్ మండలం చెర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ హోలీ రోజూ మద్యం తాగి ఇంటివచ్చాడు. భార్యను మటన్ వండాలని కోరాడు. అయితే, అందుకు ఆమె నిరాకరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నవీన్ ఊగిపోయాడు. అవమానంగా ఫీల్ అయ్యాడు. జేబులో ఉన్న ఫోన్ తీసి డయల్ 100కి ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. ఇది సిల్లీ విషయం అని పోలీసులు లైట్ తీసుకున్నారు.
కానీ నవీన్ వదలకుండా ఆరుసార్లు పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి పోలీసులను విసిగించాడు. దీంతో నవీన్కు బుద్ధిచెప్పాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. పెట్రోలింగ్ పోలీసులు అతడి ఇంటికి చేరుకున్నారు. నవీన్ మద్యం మత్తులో ఉండడంతో వెనుదిరిగారు. మరుసటిరోజు పోలీసులు నవీన్ ఇంటికి వచ్చి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఐసీసీ సెక్షన్ 290, 510 కింద కేసు పెట్టారు.
కాగా, ఆపదలో లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు ఉద్దేశించిన డయల్ 100 సౌకర్యాన్ని దుర్వినియోగం చేయవద్దని కనగల్ ఎస్ఐ నగేశ్ ప్రజలను కోరారు. సంబంధం లేని విషయంపై 100కు ఫోన్ చేసి పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేసినందుకు నవీన్పై కేసు పెట్టినట్లు వివరించారు.