హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ప్రముఖ నటి రష్మిక మందన్నా డీప్ఫేక్ కేసులో ప్రధాన నిందితుడిని ఢిల్లీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్ (24)ను అరెస్టు చేసినట్టు ఢిల్లీ డీసీసీ హేమంత్ తివారి చెప్పారు. ఇతడే రష్మిక వీడియోను సృష్టించినట్టు అనుమానిస్తున్నట్టు తెలిపారు. నిందితుడి నుంచి ల్యాప్టాప్, మొబైల్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రష్మిక పేరుతో కొన్నాళ్లు ఫ్యాన్స్ పేజీని నడిపిన నవీన్.. ఫాలోవర్ల సంఖ్యను పెంచుకొనేందుకు రష్మిక డీప్ఫేక్ వీడియో సృష్టించినట్టు తెలిపారు. మరో ఇద్దరు ప్రముఖుల పేర్లతోనూ ఇతడు ఫ్యాన్స్ పేజీలను నడిపినట్టు గుర్తించామని పేర్కొన్నారు. నిందితుడిని విచారిస్తున్నట్టు తెలిపారు.
జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖం
బ్లాక్ డ్రెస్లో ఉన్న బ్రిటీష్-ఇండియన్ ఇన్ ఫ్లూయెన్సర్ జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేశారు. అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియో నిరుడు నవంబర్లో వైరల్ అయింది. వీడియోపై పలువురు ప్రముఖులు మండిపడ్డారు. ఢిల్లీ మహిళా కమిషన్ నుంచి పోలీసులకు నోటీసులు అందాయి. ఈ ఘటనపై నవంబర్ పదిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత కత్రినాకైఫ్, కాజోల్ వంటి వారి డీప్ఫేక్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. మాజీ క్రికెటర్ సచిన్ టెండూలర్ డీప్ ఫేక్ వీడియో ఈ వారం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా.. శనివారం సోనూసూద్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది.