హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం సమావేశమైన కేంద్ర సంఘ కార్యవర్గం రాజేందర్ను తిరిగి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నది. ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన మారం జగదీశ్వర్, అసోసియేట్ అధ్యక్షులుగా కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, కోశాధికారిగా రామినేని శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. వీరితోపాటు 10 మంది ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఇతర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరంతా 2025 వరకు పదవుల్లో కొనసాగుతారు. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన ఈ ఎన్నికలకు జీ వెంకటేశం ఎన్నికల అధికారిగా, శశికాంత్రెడ్డి సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కేంద్రం సంఘం నాయకులతోపాటు, 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్నికల్లో పాల్గొన్నారు.
తనపై నమ్మకం ఉంచి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్న ఉద్యోగులకు రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గతంలో మాదిరిగానే ఈ దఫా కూడా శక్తివంచనలేకుండా కృషిచేస్తానని, ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటూనే సమస్యలను పరిషరించుకుందామని అన్నారు. త్వరలో ఈహెచ్ఎస్ కార్డుల పంపిణీ, పీఆర్సీ, ఇతర పెండింగ్ సమస్యల పరిషారానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మామిళ్ల రాజేందర్ నాయకత్వంలో పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.