శ్రీశైలం, ఫిబ్రవరి 25: శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారు నాల్గో రోజైన శుక్రవారం మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. డప్పు చప్పుళ్ల మధ్య గ్రామోత్సవం శోభాయమానంగా జరిగింది. ఉభయ దేవాలయాల్లో షోడశోపచార పూజలు నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానం నుంచి పట్టు వస్ర్తాలు సమర్పించారు.