హైదరాబాద్, డిసెంబర్, 31 : యాదాద్రి దేవాలయ విమాన గోపుర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బంగారు తాపడం కోసం ఎన్ఆర్ఐ పైళ్ల మల్లారెడ్డి కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు.
ఈ మేరకు..దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని గచ్చిబౌలిలో ఆయన నివాసంలో కలిసి మల్లారెడ్డి చెక్కును అందించారు. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ మహత్కార్యంలో భాగస్వామ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డికి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు పలువురు ముందుకొస్తున్నారని, దేవాదాయ శాఖ తరపున వారందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
దాతృత్వం చాటుకుంటున్న మల్లారెడ్డి..
ఉన్న ఊరుని, కన్న తల్లి తండ్రులని మరచిపోతున్న నేటి ప్రపంచంలో ఉన్న ఊరు, కన్న తల్లి దండ్రులనే కాదు, తన రాష్ట్రానికి, దేశానికి కూడా ఎంతో చేస్తున్నారు పైళ్ల మల్లారెడ్డి. కరోనా సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయల నిధులు విరాళంగా ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.
మిషన్ కాకతీయ పథకానికి 50 లక్షల రూపాయలు అందించి, అన్నదాత కు వెన్నుదన్నుగా నిలిచారు. సొంత ఊరు నల్గొండ జిల్లా సుంకిశాల లో కాలేజీ కట్టించి విద్యాదానం చేస్తున్నారు. శ్రీవేంకటేశ్వర ఆలయం కట్టించి ఆ వైకుంఠ ధామాన్ని నిలిపారు.
ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్ పిలుపు నందుకొని శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం స్వర్ణ తాపడానికి కేజీ బంగారం విరాళంగా ఇచ్చారు.