కొత్తూరు/శంషాబాద్, ఏప్రిల్ 18: కొత్తూరు మండలంలోని మల్లాపూర్కు చెందిన డాక్యుమెంటరీ రైటర్ మామిడి కరుణాకర్రెడ్డి హత్య కేసును పోలీసులు చేధించారు. కరుణాకర్రెడ్డి ఉపకారం పొంది.. అపకారం తలపెట్టినందుకే అంతమొందించినట్టు నిందితులు తమ విచారణలో వెల్లడించారని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ఈ కేసులో నిందితులైన ఐదుగురిలో నలుగురిని అరెస్ట్ చేయగా, ఒకరు లొంగిపోయారు. మంగళవారం సాయంత్రం శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు.
హత్యకు గురైన డాక్యుమెంటర్ రైటర్ కరుణాకర్రెడ్డి కొత్తూరు ఎంపీపీ పన్నింటి మధుసూదన్రెడ్డికి బంధువు. మధుసూదన్రెడ్డి.. కరుణాకర్రెడ్డికి ఆర్థికంగా సహాయం చేశాడు. దీంతోపాటు కొంతకాలంపాటు అనుచరుడిగా ఉన్నాడు. ఆ సమయంలోనే అతనికి తహసీల్దార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్రైటర్ దుకాణం పెట్టించాడు. దీంతో కరుణాకర్రెడ్డి ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. తన సోదరుడు చిట్టెడు అరుణ్కుమార్రెడ్డికి వ్యాపార భాగస్వామ్యం ఇవ్వాలని మధుసూదన్రెడ్డి కోరాడు. అందుకు కరుణాకర్రెడ్డి నిరాకరించాడు. మధుసూదన్రెడ్డికి సంబంధించి భూమి ఫెన్సింగ్ను ప్రత్యర్థులతో కలిసి ధ్వంసం చేశాడు. మధుసూదన్రెడ్డి ప్రత్యర్థులతో సఖ్యతగా మెలగడం ప్రారంభించాడు. దీంతో కోపం పెంచుకున్న మధుసూదన్రెడ్డి.. కరుణారెడ్డిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
కరుణాకర్రెడ్డి తన స్నేహితుడు శ్రీధర్రెడ్డితో కలిసి ఓ కారులో మల్లాపూర్ వెళ్తుంటే ఎంపీపీ పన్నింటి మధుసూదన్రెడ్డితోపాటు విక్రమ్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, మహ్మద్ ఆరీఫ్ పాషా, చిట్టెడు అరుణ్కుమార్రెడ్డి కలిసి అతడి కారును అడ్డగించి అద్దాలను ధ్వంసం చేశారు. అతడిని మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో తిప్పుతూ తీవ్రంగా కొట్టగా సృహతప్పి పడిపోయాడు. మధుసూదన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి ఇంటికి వెళ్లిపోయారు. విక్రమ్రెడ్డి, మహ్మద్ ఆరీఫ్, చిట్టెడు అరుణ్కుమార్రెడ్డిలు కలిసి కరుణాకర్రెడ్డిని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే కరుణాకర్రెడ్డి మరణించినట్టు ధ్రువీకరించారు. రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం నిందితులను రాజేంద్రనగర్ సన్సిటీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కాగా చిట్టెడు అరుణ్కుమార్రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు.