మెట్పల్లి రూరల్ : జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దాపూర్ మల్లన్నకు.. 60వేలకుపైగా బోనాలను సమర్పించారు. ఉపవాస దీక్షలతో వండిన బోనాలను నెత్తిన పెట్టుకొని మల్లన్న ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. బెల్లం, గొర్రెపిల్లలను కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అనంతరం మల్లన్న స్వామి రథోత్సవాన్ని భక్తుల హర్షధ్వానాల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేత కల్వకుంట్ల సంజయ్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.