మహబూబ్నగర్, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీటీడీపీ సీనియర్ నేత, మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్రెడ్డి మంగళవారం ఉదయం మృతి చెందారు. వెన్నెముక క్యాన్సర్తో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చేర్పించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కాపూర్ గ్రామానికి తరలించారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు దయాకర్రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. దయాకర్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోశారు. దయాకర్రెడ్డి మృతిపట్ల స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్, వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ సంతాపం ప్రకటించారు.