హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 13న ఉదయం 11 .30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడంలో పోలీస్శాఖ కీలకపాత్ర పోషించాలని డీజీపీ మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారని అభినందించారు.
ఆయా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని 16న నిర్వహించే జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ గ్రామస్థాయి నుంచి అన్ని ప్రధాన రహదారులు, జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో అందరూ పాల్గొనేలా పోలీస్శాఖలోని అధికారులంతా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్థానిక మున్సిపల్ వార్డులు, ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జైళ్లు, పోలీస్ కార్యాలయాలు, మార్కెట్ స్థలాలు, గుర్తించిన ఇతర దేశాల్లో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించాలని డీజీపీ సూచించారు. ఇందుకు జిల్లా కలెక్టర్లు, ఇతర పాలనాశాఖల అధికారులతో జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతో సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ట్రాఫిక్ జంక్షన్లలో సామూహిక జాతీయ గీతాలాపన కోసం ప్రజలు గుమిగూడే ప్రదేశాలను గుర్తించి, 11.30గంటలకు ట్రాఫిక్ను నిలిపివేసి.. అలారం మోగించేవిధంగా మైక్ సిస్టమ్స్ ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని, జాతీయ గీతాలాపన సమయంలో ఎలాంటి శబ్దాలు లేకుండా, క్రమశిక్షణతో ఆలపించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.