హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): నాసిక్ పట్టణం నీట మునిగింది. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నం. ఊహించని స్థాయిలో ఎగువ నుంచి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నా.. ఉపనదులైన మాంజ్రా, మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి, వార్ధా, పెన్గంగల్లో ఏకకాలంలో వరద పోటెత్తుతున్నా.. ఎక్కడా ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు క్షేత్రస్థాయి అధికారులు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఇరిగేషన్ శాఖ రీ ఆర్గనైజేషన్ చేయడం సత్ఫలితాలనిచ్చింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ (ఓఅండ్ఎం) విభాగం. గడిచిన మూడురోజులుగా ఓఅండ్ఎం అధికారులు ప్రతీక్షణం అప్రమత్తంగా ఉంటూ వరద ప్రవాహాలపై కచ్చితమైన లెక్కలు అంచనా వేస్తూ క్షేత్రస్థాయి సిబ్బందికి ఎప్పకప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. దీనితో ముంపు లేకుండా, ఎలాంటి వరద ప్రభావం లేకుండా అధికారులు సమర్థవంతంగా వరద నియంత్రణ చర్యలను చేపడుతున్నారు. కడెం ప్రాజెక్టు నిర్మించిన దగ్గరి నుంచి ఎన్నడూ లేనివిధంగా 5.20 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది. ఎఫ్ఆర్ఎల్ను దాటి 705 ఫీట్ల వరకు నీరు చేరుకోవడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. అంత ప్రమాదకర స్థితిలో కూడా ప్రాజెక్టు ఇంజినీర్లు గేజింగ్ రూంలో ఉండి విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గురువారం వరద తగ్గుముఖం పట్టడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఓఅండ్ఎం విభాగం.. ఎగువ నుంచి వస్తున్న వరదతోపాటు, లోకల్ రివర్ క్యాచ్మెంట్ ఏరియాలో నమోదవుతున్న వర్షపాతాన్ని, తద్వారా రాబోయే వరదను కచ్చితత్వంతో అంచనా వేస్తూ సంబంధిత సమాచారాన్ని క్షేత్రస్థాయి ఇంజినీరింగ్ సిబ్బందికి చేరవేస్తూ సూచనలిస్తున్నారు.