హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సు వెల్లువడ్డాక కోర్ ఇంజినీరింగ్ కోర్సులను కాపాడుకొనేందుకు జేఎన్టీయూ ప్రవేశపెట్టిన మేజర్, మైనర్ డిగ్రీలు సత్ఫలితాలనిస్తున్నాయి. జేఎన్టీయూ కాన్స్ట్యూయంట్ కాలేజీలతో పాటు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు కూడా మేజర్, మైనర్ డిగ్రీల బాటపడుతున్నాయి. 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో మేజర్, మైనర్ డిగ్రీలకు జేఎన్టీయూ అనుమతించింది. ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఈ కాలేజీలకు అవకాశం కల్పించింది. బీటె క్ థర్డ్ ఇయర్ మొదటి సెమిస్టర్లో చేరి నాలుగేండ్ల బీటెక్ పూర్తయ్యే వరకు ఎప్పుడైనా ఈ మైనర్ డిగ్రీని పూర్తిచేసుకోవచ్చు. ఆయా విద్యార్థి 18 క్రెడిట్స్ను సాధిస్తేనే మైన ర్ డిగ్రీ సర్టిఫికెట్ను అందజేస్తారు. 160 క్రెడి ట్స్ సాధిస్తే రెగ్యులర్ బీటెక్ డిగ్రీని జారీచేస్తారు.
బీటెక్లో సీఎస్ఈ, ఐటీ, డాటా అనలెటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్లర్నింగ్ తదితర కోర్సుల రాకతో కోర్ కోర్సులకు కష్టకాలం వచ్చిపడింది. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఈఈఈ కోర్సుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నది. దాంతో కాలేజీలన్నీ కోర్ కోర్సులను రద్దు చేసుకునేందుకు సిద్ధపడుతున్నాయి. నిరుడు, ఈసారి కలిపి 7,010 కోర్ కోర్సుల సీట్లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక్కో బ్రాంచిని 30 సీట్లతోనైనా నిర్వహించాలని తాజాగా ఏఐసీటీఈ స్పష్టంచేసింది.
కంప్యూటర్ ఆధారిత ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మా కాలేజీలో రెండు మైనర్ డిగ్రీలను నిర్వహిస్తున్నాం. ఈఈఈ, ఈసీఈ విద్యార్థులకు కంప్యూటర్సైన్స్, అన్ని బ్రాంచిల విద్యార్థుల కోసం మైనర్ డిగ్రీ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ను ప్రవేశపెట్టాం. ఒక థియరీ, ఒక ల్యాబ్ వర్క్ ఉండేలా ప్రణాళికలు చేశాం. రాబోయే రోజుల్లో డాటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్లర్నింగ్ వంటి కోర్సుల్లోనూ మైనర్ డిగ్రీలు అందజేస్తాం.
– వినయ్బాబు, స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీ