విజయవంతంగా ట్రయల్ రన్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఆకాశమార్గాన మందుల సరఫరా చేస్తున్న సంస్థల జాబితాలో మహీంద్రా లాజిస్టిక్ చేరింది. ఆదివారం డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా మందుల సరఫరాను విజయవంతంగా నిర్వహించింది. మారుమూల ప్రాంతాలకు సకాలంలో మందులను అందజేసేందుకు తెలంగాణ ఐటీశాఖ ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రాజెక్టు’ను చేపట్టిం ది. దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ల ద్వారా మందుల సరఫరా ప్రాజెక్టును గత నెల 11న కేంద్రమంత్రి సింథియా ప్రారంభించారు. అప్పటినుంచి పలు ప్రైవేటు సంస్థలు డ్రోన్ల ద్వారా మందులను గ్రామీణ ప్రాంతాలకు వేగంగా పంపిణీ చేసే పరీక్షలను నిర్వహించాయి. ఇప్పటికే మూడు సంస్థలు నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం కాగా, తాజాగా ఆదివారం మహీంద్రా లాజిస్టిక్ డ్రోన్ ద్వారా మందులను సరఫరా చేసింది. వికారాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతంలో దీనిని నిర్వహించారు. ఉన్నతాధికారులు, నిపుణుల బృందం పర్యవేక్షణలో జరిపిన పరీక్షలు విజయవంతమయ్యాయని తెలంగాణ ప్రభుత్వ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ట్విట్టర్లో పోస్టుచేసింది.