హైదరాబాద్ : సివిల్స్ ర్యాంకుల్లో సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్(Mahesh Bhagwat ) స్టూడెంట్స్ మరోసారి హవా కొనసాగించారు. ఈసారి ఏకంగా 150 మంది సివిల్స్ అభ్యర్థులు (Civils Candidates)ర్యాంకులు సాధించడం విశేషం. అయితే తన మార్గనిర్దేశనంలో ఈ ఏడాది సివిల్స్ టాపర్ ఇషితా కిశోర్(Topper Ishita Kishore) ఉండడం గొప్ప విషయమని ‘నమస్తే తెలంగాణ’తో తన ఆనందాన్ని పంచుకున్నారు సీఐడీ ఏడీజీ(CID ADG) మహేశ్ భగవత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ప్రత్యేకించి సివిల్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఇంటర్వ్యూకు సంబంధించి ప్రతిరోజూ మార్గనిర్దేశనం చేసినట్లు చెప్పారు.
ఇందుకోసం ప్రత్యేకంగా రెండు వాట్సాప్(Whats app) గ్రూపులు ఏర్పాటు చేశామని, వీటిల్లో దేశవ్యాప్తంగా వందల మంది సివిల్స్ క్వాలిఫై(Civils Qualify) అయిన అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు. ప్రతిరోజూ వారికి జూమ్ మీటింగ్స్ (Zoom Meeting)ఏర్పాటు చేసి.. ఇంటర్వ్యూను ఎదుర్కొనే విధానంపై గైడెన్స్ ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో పాటుగా ఫోన్లోనూ, నేరుగా తనని కలిసిన అభ్యర్థులకు సైతం పలు అంశాలపై సూచనలు చేసినట్లు తెలిపారు.
ఈసారి సివిల్స్కు అర్హత సాధించిన మొత్తం 933 మందిలో 150 మంది వరకు తన స్టూడెంట్స్ ఉన్నట్లు తెలిపారు. వీరిలో 1వ ర్యాంకు సాధించిన ఇషితా కిషోర్, 4వ ర్యాంకు స్మృతి మిశ్రా, 14వ ర్యాంకు కృతికా గోయెల్, 22వ ర్యాంకు జీవీఎస్ పవన్ దత్తా, 25వ ర్యాంకు సుంకె కష్మిరా కిశోర్, 35వ ర్యాంకు అజ్మిరా సంకేత్ కుమార్, 38వ ర్యాంకు అనూప్ దాస్, 54వ ర్యాంకు రిచా కులకర్ణి, 78వ ర్యాంకు ఉత్కర్ష్కుమార్, 74వ ర్యాంకు ఆయుషీ జైన్, 76వ ర్యాంకు సాధించిన వసంత్ దాబుల్కర్ టాప్-100లో ఉన్నట్లు వెల్లడించారు.