హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లోకి పక్క రాష్ర్టాలనుంచి చేరికలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయకుడు మహ్మద్ అఖిల్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్అలీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మహమూద్అలీ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీని అధికారం కోసం స్థాపించలేదని, దేశాభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తప్పుడు విధానాల వల్ల ప్రపంచస్థాయిలో దేశ ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అన్ని మతాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జావేద్ అహ్మద్, మహమ్మద్ నవీద్, ఉమర్ షేక్, జావేద్ షేక్ మహమ్మద్ నౌమాన్, ఫైసల్ తదితరులు పాల్గొన్నారు.