ప్రాదేశిక ప్రాంతాలపై ఆధిపత్యం కోసం మనుషులే కాదు..జంతువులు కూడా కొట్లాటకు దిగుతాయి. తమ ప్రాంతంలోకి కొత్త జంతువుల రాకను తీవ్రంగా ప్రతిఘటిస్తాయి. ఇందుకు కుమ్రంభీం ఆసిపాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ కారిడార్ పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దు దరిగాం అటవీ ప్రాంతంలో రెండు పులుల మధ్య జరిగిన పోరాటమే నిదర్శనంగా నిలుస్తున్నది. అటవీ ప్రాంతంలో తొలిసారి మరో పులితో జరిగిన భీకర పోరులో ఓ ఆడ పులి తనువు చాలించింది. ఈ ఘటన అటవీశాఖ అధికారులను తీవ్ర కలవరానికి గురి చేసింది. మున్ముందు మరిన్ని ఘటనలు జరిగితే ఎలా అన్న ఆందోళన నెలకొన్నది.
Tigers | హైదరాబాద్, జనవరి 7 (నమస్తేతెలంగాణ): అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగితే ఆధిపత్య పోరు తప్పదన్న హెచ్చరికలు నిజమవుతున్నాయి. తమ ప్రాంతంలోకి కొత్తవాటి రాకను సహించలేక పోవడంతో వాటి మధ్య బీకర పోరుకు దారితీస్తున్నది. ఈ దాడుల్లో పులులు మృత్యువాత పడుతున్నాయి.
తాజాగా మన రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిపాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ కారిడార్ పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దులోని దరిగాం అటవీ ప్రాంతంలో తొలిసారి మరో పులితో జరిగిన బీకర పోరులో ఓ ఆడ పులి తనువు చాలించింది. మహారాష్ట్ర సరిహద్దు నుంచి వలస పులులు వస్తుండగా, కాగజ్నగర్ కారిడార్లో ఉన్న పులులు ఆధిపత్యం కోసం వాటి రాకను ఒప్పుకోవడం లేదని తేలింది. ఆ దాడిలో ప్రాణాలను సైతం లెకచేయకుండా పోరు సలుపుతాయని రుజువైంది. పులి తమ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఆధిపత్య పోరు సలిపి తమ జాతి వర్గాన్నే అంతం చేసుకుంటున్నది.
తొలి టెరిటోరియల్ టైగర్ డెత్
మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా మాలిని అటవీ ప్రాంతం సమీపంలోని గోంది-కుమ్రంభీం జిల్లా కాగజ్నగర్ దరిగాం అటవీ ప్రాంతం మధ్య కుమ్రంభీం ప్రాజెక్ట్ కాలువ సమీపంలో రెండు ఆడ పులులు భీకరంగా తలపడగా, ఒక ఆడ పులి మృతి చెందినట్టు నిర్ధారించార్ధారు. శనివారం ఓ పశువుల కాపరి ఆ ప్రాంతానికి వెళ్లగా పులి మృతి చెంది ఉన్నట్టు గుర్తించి, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీనిని కాగజ్నగర్ అడవుల్లో తొలి టెరిటోరియల్ టైగర్ డెత్గా గుర్తించామని డీఎస్వో తెలిపారు.
45 రోజుల్లో 10 పులుల మృత్యువాత
తెలంగాణలోని కుమ్రంభీం జిల్లా, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సరిహద్దులోని సుమారు 60 కిలోమీటర్ల పరిధిలోని అటవీ ప్రాంతం పరిధిలో 45 రోజుల వ్యవధిలో 10కి పైగా పులులు మృతిచెందిన ఘటనలు కలవరపెడుతున్నాయి. ఆధిపత్య పోరులోనే 7 పులులు చనిపోయాయని అటవీ అధికారులు చెప్తున్నారు. నిరుడు నవంబర్ 14న చంద్రాపూర్ జిల్లా చీమూరు అటవీ ప్రాంతంలో రెండు పులుల మధ్య జరిగిన పోరులో ఓ పులి మృతి చెందింది. నవంబర్ 18న తడోబాలో మరో పులి కన్నుమూసింది. డిసెంబరు 10న వరోరా అటవీ రేంజ్లో ప్రమాదంలో ఓ పులి చనిపోగా, డిసెంబరు 14న పలాస్గావ్లో ఇంకో పులి సహజంగా చనిపోయింది. డిసెంబర్ 21న సిందేవాహి రేంజ్లో విద్యుదాఘాతంతో ఓ పులి మృతిచెందింది.
దరిగాం అడవిలో పులి మృతిపై విచారణ
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దరిగాం అటవీ ప్రాం తంలో పులి మృతిపై అటవీశాఖ అధికారులు ఆదివారం విచారణ జరిపారు. సీసీఎఫ్ శాంతారాం, డీఎఫ్వో నీరజ్కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి ఆనవాళ్లను పరిశీలించారు. అనంతరం కాగజ్నగర్లో మీడియాతో మాట్లాడుతూ.. ఒకటిన్నరేండ్లలోపు, రెండేండ్లు దాటిన ఆడ పులుల మధ్య ఆవాసం కోసం ఘర్షణ జరిగి ఉండవచ్చని తెలిపారు. ఈ ఘర్షణలో ఒకటిన్నరేండ్లలోపున్న పులి కాలు, మెడ, శరీరంపై బలమైన గాయాలతో తీవ్ర రక్తస్రావమై మృతి చెంది ఉంటుందని పేర్కొన్నారు. పులిపై ఎలాంటి విషప్రయోగం, వేటాడిన ఆనవాళ్లు కానీ లేవని ప్రాథమికంగా నిర్ధారించారు. పశువైద్యులు విజయ్కుమార్, శ్రీకాంత్ పంచనామా నిర్వహించి శాంపిళ్లను హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు.