హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో తెలుగు ప్రజలు పాల లో చక్కెర మాదిరిగా మమేకం అయ్యారని, తమ సంస్కృతిని కాపాడుకుంటూనే మహారాష్ట్ర అభివృద్ధిలో భాగం అయ్యారని బీఆర్ఎస్ పార్టీ కొంకణ విభాగ సమన్వయకర్త ప్రొఫెసర్ విజయ్ మొహితె తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఆర్థిక సహాయం అందించటంలో విఫలమయ్యాయని మండిపడ్డారు. మహారాష్ట్రలోని భీవండిలో పద్మశాలిసమాజ్ హాల్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల మార్గదర్శన శిబిరం, పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న ఉచిత విద్యుత్తు, రైతుబంధు వంటి పథకాలు మహారాష్ట్రలోని పేదలందరికీ అందజేయాలంటే, బీఆర్ఎస్ను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ గొప్ప దార్శనికుడని కొనియాడారు. భీవండి లోకసభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త యెలిగేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భీవండి ప్రజల సమస్యలు దూరం కావాలంటే బీఆర్ఎస్ బలోపేతం కావాలని చెప్పారు. ఠాణే జిల్లా సమన్వయకర్త దిగంబర్ విశే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కలలను సాకారం చేయాలంటే, అందరూ కలిసి జిల్లా లో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెం దిన కార్యకర్తలు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ప్రొఫెసర్ విజయ్ మొహితె కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో భీవండి ఈస్ట్ సమన్వయకర్త సిరిపురం తిరుపతి, భీవండి వెస్ట్ సమన్వయకర్త సిరిమల్లె శ్రీనివాస్, భీవండి రూరల్ సమన్వయకర్త వినాయక్ వకారే, హైకోర్టు అడ్వకేట్ రాపెల్లి తిరుపతి, పద్మశాలిసమాజ్ మాజీ అధ్యక్షుడు వేముల నర్సయ్య, మహిళ జన్జాగృతి అధ్యక్షురాలు బొద్దుల రమాదేవి, నోముల శేఖర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.