మహబూబాబాద్ : రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ అదనంగా 10వేల కోట్ల రూపాయలను కేటాయించారు. దీంతో వైద్యారోగ్య రంగానికి మహర్ధశ పట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్కు మంజూరు చేసిన మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలకు కేటాయించిన స్థలాన్ని, నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించి మాట్లాడారు.
ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లు అన్ని విధాల బలోపేతం కానున్నాయని ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మహబూబాబాద్ మెడికల్ హబ్ గా మారిందన్నారు.
మానుకోటకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, టీచింగ్ హాస్పిటల్, ఆక్సిజన్ ప్లాంట్ వచ్చాయి. ఇటీవలే 2.73 కోట్ల రూపాయలతో టి. డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభించుకున్నాం. వీటన్నింటి వల్ల ఇక్కడి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
మహబూబాబాద్ మీదుగా కేంద్రం నుంచి మూడు జాతీయ రహదారులు వచ్చాయి. గ్రీన్ ఫీల్డ్ లో రోడ్డుకు సంబంధం లేకుండా నాగపూర్ నుంచి మచిలీపట్నం వరకు జిల్లా బైపాస్ గా జాతీయ రహదారి వస్తుందని తెలిపారు. భద్రాచలం నుంచి వయా తిరుమలగిరి, వలిగొండ, హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి వచ్చింది. కోదాడ నుంచి కొరివి వరకు వచ్చే లింక్ కలిపే జాతీయ రహదారికి నిధులు వచ్చాయి. ఇవన్నీ రావడంతో జిల్లా మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.
భవిష్యత్ లో హార్టికల్చర్, పాలిటెక్నిక్ కాలేజీ వచ్చి జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి. ఈ ప్రాంతంలో వాణిజ్య పంటలు ఎక్కువ పండుతున్నాయి. ఇప్పటికే రెండు ప్రాసిసెంగ్ కేంద్రాలు వచ్చాయి. తద్వారా ఈ ప్రాంతంలో మిర్చి రైతులకు మంచి ధరలు వస్తున్నాయి.
మిగిలిన వాణిజ్య పంటలను ప్రోత్సహించి రైతులకు లాభం చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కలెక్టరేట్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కలెక్టర్ వి.పి గౌతమ్ ఉన్నారు.