హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): జమ్ముకశ్మీర్లో జూన్ 8న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ సంప్రోక్షణ ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. జూన్ 3న శ్రీవారి ఆలయంలో వైదిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపింది. వైఖానస ఆగమోక్తంగా, సర్వాంగ సుందరంగా నిర్మించిన ఈ ఆలయం మాతా వైష్ణోదేవి దర్శనం కోసం జమ్మూ వచ్చే భక్తులకు ఎనలేని ఆధ్మాత్మిక అనుభూతి ఇవ్వనున్నదని టీటీడీ అధికారులు తెలిపారు. జూన్ 3న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆచార్యవరణం, పుణ్యాహవాచనం, అంకురార్పణ నిర్వహిస్తారు. జూన్ 8న సాయంత్రం 5 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డితోపాటు పలువురు స్థానిక ప్రముఖులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారని టీటీడీ తెలిపింది.