హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): చెన్నై జీఎన్ చెట్టి వీధిలో టీటీడీ నిర్మించిన శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ మహాకుంభాభిషేకం శుక్రవారం శాస్త్రోక్తంగా,అత్యంత వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శారదా పీఠాధిపతి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి కృషితో అమ్మవారి ఆలయం అద్భుతంగా నిర్మించారని అన్నారు. ఆలయ నిర్మాణానికి స్థలం విరాళంగా ఇచ్చిన సినీనటి కాంచన, వారి కుటుంబ సభ్యులు అదృష్టవంతులని, వారికి వేంకటేశ్వరస్వామి, శ్రీపద్మావతి దేవి ఆశీస్సులు ఉంటాయన్నారు. స్వామివారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా.. తమిళులు తమ సొంతదైవంగా భావిస్తారని స్వామి చెప్పారు.