హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): పంద్రాగస్టు సందర్భంగా చారిత్రక గోల్కొండ కోటలో మంగళవారం నిర్వహించిన సాంస్కృతిక కళారూపాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 1200 మంది కళాకారులు 32 కళారూపాలను ప్రదర్శించారు. చిందు యక్షగానం, కోలాటం, ఒగ్గుడోలు, బోనాల కోలాటం, ఘట విన్యాసం, కాటికాపరులు, శారద కథలు, దుబ్బుల కళాకారులు, బంజారా, లంబాడి, గుస్సాడీ, కొమ్ము కోయ, థింసా, రాజన్నడోలు, డప్పులు, పులివేషాలు, బుడబుక్కలు, మహిళా డప్పులు, బైండ్ల కథ, బోనాలు, మాధురి, నగారాలు, కొమ్ములు, బూరలు, వంటి జానపద గిరిజన ఆదివాసీ కళారూపాలు అలరించాయి. శాస్త్రీయతను ప్రతిబింబించే పేరిణి, కూచిపూడి, కథక్, భరతనాట్య కళాకారులు తమ అభినయం, ఆహార్యాన్ని ప్రదర్శిస్తూ వీక్షకులను రంజింపజేశారు. మరోవైపు హైదరాబాదీ దక్కనీ సంస్కృతికి ప్రతిబింబాలుగా నిలిచే శేరిబాజా, మార్ఫా వంటి కళారూపాలు, భారతీయతకు ప్రతినిధులుగా నిలిచే రాజస్థానీ, పంజాబీ, గుజరాతీ కళలు 77వ స్వాతంత్య్ర దినోత్సవ సాంస్కృతిక ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.
పూల సింగిడిని తలపించిన ప్రదర్శనలు: మామిడి హరికృష్ణ,
కళాకారుల నృత్యాలు పూల సింగిడిని తలపించాయని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తెలిపారు. వేష భూషణాలతో తమ ఆహార్యాన్ని, నటనా కౌశల్యం ప్రదర్శన తెరవెనుక కళాకారులు ఎంతో శ్రమకోర్చారని పేర్కొన్నారు. 1200 మంది కళాకారులకు అన్ని సౌకర్యాలతో ముందు రోజు లలితకళాతోరణంలో రిహార్సల్స్ నిర్వహించామని చెప్పారు. అల్పాహారం ముగించుకొని 22 బస్సుల్లో 1200 మంది కళాకారులు గోల్కొండ కోటకు 7.30 గంటల వరకే చేరుకొని అద్భుత కళా ప్రదర్శనతో సందర్శకులను కనువిందు చేసినట్టు వివరించారు.