హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): మనుషుల రోగాలను ఆసరా చేసుకొన్న ఫార్మా మాఫియా నిలువు దోపిడీ చేస్తున్నది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు ఔషధాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నది. ఈ మేరకు సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు శనివారం హైదరాబాద్ నగరంతోపాటు నల్లగొండ ప్రాంతంలోని పలు మెడికల్ షాపులపై దాడులు చేసి పెద్ద మొత్తంలో లెట్రోజోల్ ట్యాబ్లెట్ ఐపీ 2.5 ఎంజీ మాత్రలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా కేంద్రంగా స్టెపన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మా సంస్థ ‘సైలెట్-2.5’ (లెట్రోజోల్ ట్యాబ్లెట్ ఐపీ 2.5 ఎంజీ) అనే మాత్రలను రొమ్ము క్యాన్సర్ చికిత్సకు వినియోగిస్తారు. ప్రతి ఐదు మాత్రలతో కూడిన ఒక స్ట్రిప్ ధర జీఎస్టీ, సెల్లింగ్ ప్రైస్తో కలిపి రూ.164.2గా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నిర్ణయించింది. కానీ సంబంధిత ఔషధ తయారీ కంపెనీ మాత్రం ఎన్పీపీఏ నిబంధనలకు విరుద్ధంగా 5 మాత్రలతో కూడిన ఒక స్ట్రిప్ ధర రూ.199గా పేర్కొంటూ మాత్రలపై ముద్రించి విక్రయిస్తున్నది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఒక్కో స్ట్రిప్పై రూ.34.80 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నది. డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు సోమేశ్వర్, జీ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.