మహదేవపూర్, ఏప్రిల్ 8: తక్షణమే వ్యవసాయానికి సాగునీరందించి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, కేంద్ర కమిటీ సభ్యులు జీ నాగయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం వారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి బందు సాయిలుతో కలిసి మేడిగడ్డ బరాజ్ను సందర్శించారు. బరాజ్లో కుంగిన పిల్లర్లను, బరాజ్కు ఎగువన మహారాష్ట్రలోని ప్రాణహిత నది ద్వారా వస్తున్న ఇన్ఫ్లో, అవుట్ ఫ్లోను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాగునీటి కష్టాలతో రైతులు అల్లాడుతున్నారని, మేడిగడ్డకు ఎగువ నుంచి వస్తున్న నీరు వృథాగా దిగువకు పోతున్నదని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎగువకు లిఫ్ట్ చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కష్ట కాలంలో మేడిగడ్డ నీటిని వినియోగించడంతోనే ప్రజలకు తాగు, రైతులకు సాగునీటి కష్టాలు తీరుతాయని చెప్పారు. మేడిగడ్డపై రాజకీయాలు మానుకొని రైతుల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టీ సాగర్, జిల్లా కార్యవర్గ సభ్యులు పోలం రాజేందర్, జిల్లా కమిటీ సభ్యులు వీ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.