తెలంగాణచౌక్, నవంబర్ 26 : వర్గీకరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలను మరోసారి మోసం చేస్తున్నదని మాదిగ రాజకీయ పోరాట సమితి అనుబంధ సంస్థ మాదిగ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి రమేశ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గాలిపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్లో జిల్లా కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడుతున్నారని తెలిపారు. దళిత జాతి కోసం ప్రపంచంలోనే లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టి ప్రతి దళిత బిడ్డకు పది లక్షల రూపాయలు అందిస్తున్న మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. బీజేపీ అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి, తొమ్మిదేండ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు చేపట్టలేదో మాదిగ సమాజానికి ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగలను ఓటు బ్యాంకు మాదిరిగా వాడుకుంటున్నట్టు విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో మాదిగలను మరోసారి మోసం చేయడం కోసం కమిటీ వేస్తామని ప్రకటించడాన్ని వారు తప్పుబట్టారు. కమిటీల పేరుతో కాలయాపన తప్ప వర్గీకరణ చేయరని విమర్శించారు.