హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): దళితులను సాధికారులుగా చేయాలని సీఎం కేసీఆర్ 20 ఏండ్ల క్రిందనే కలలు కన్నారని, నాటి ఆలోచనకు ప్రతిరూపమే నేటి దళితబంధు అని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఏర్పాటుచేసిన తొలినాళ్లలో పార్టీ అధినేతగా కేసీఆర్ ఇదే వేదిక (గ్రీన్పార్క్ హోటల్)పై ఎస్సీల అభివృద్ధికి ప్రణాళికలు రచించారని, పలువురు ఐఏఎస్ అధికారులు, ఉద్యమకారులతో సమావేశమై చర్చించారని తెలిపారు. దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలలుగన్న ఏకైక నేత సీఎం కేసీఆర్ అని అన్నారు.
బేగంపేటలోని గ్రీన్పార్కు హోటల్లో మంగళవారం జరిగిన మాదిగ ఇండస్ట్రియల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (మిక్కీ) మొదటి వార్షిక సమావేశానికి వినోద్కుమార్ మఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 1985లో మొదటిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచిన నాడే సిద్దిపేట మార్కెట్ కమిటీకి చైర్మన్గా దళిత బిడ్డను ఎన్నుకున్న చరిత్ర కేసీఆర్దని చెప్పారు. అదే ఒరవడితో నేడు దళితబంధు పథకాన్ని అమలు చేస్తూ.. దళితుల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి నిర్విరామ కృషి చేస్తున్నారని కొనియాడారు. తిరిగి ఇదే చారిత్రాత్మక వేదికపై మిక్కీ సమావేశం జరగడం విశేషమని అన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మిక్కీ సభ్యుల అభ్యున్నతి కోసం తనవంతు సహకారాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారు. మాదిగ సామాజికవర్గం గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. గ్లోబల్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, ప్రస్తుత కాలంలో ప్రతిభ ముఖ్యమని, జ్ఞానం ఎదుట కులమతాలు ఏవీ పనిచేయబోవని చెప్పారు. ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ మిక్కీని నోడల్ ఏజెన్సీగా గుర్తించే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి మిక్కీ మొదటి వెబ్సైట్ను వినోద్కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణీకుముదిని, అమెరికా పారిశ్రామికవేత్త డాక్టర్ పగిడిపాటి దేవయ్య, మిక్కీ అధ్యక్షుడు సుంచు రాజ్కుమార్, వ్యవస్థాపకుడు మహేశ్, ప్రధాన కార్యదర్శి బక్క నరసింహ, సలహాదారులు ఆరేపల్లి రాజేందర్, వంశీతిలక్, గంధం రాములు, కొమ్ముల నరేందర్, జయరాజ్ తెన్నేటి, సాయికుమార్ పాల్గొన్నారు.