హైదరాబాద్: మేడే రాజీవ్ సాగర్ను తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. మహిళా, శిశు, వికలాంగ, సీనియర్ సిటిజన్స్ విభాగం కింద తెలంగాణ ఫుడ్స్ కొనసాగుతున్నది.
అదేవిధంగా, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్ గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడెమి అధ్యక్షుడిగా మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
తెలంగాణ జాగృతి కార్యకర్తగా ఉన్న మేడే రాజీవ్ సాగర్.. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 2006 నుంచి తెలంగాణ జాగృతి కోశాధికారిగా ఉన్న ఆయన అనంతర కాలంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శిగా ఆరేండ్ల పాటు కొనసాగారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఉద్యమ, సాంస్కృతిక చిహ్నమైన తెలంగాణ జాగృతి నిర్మాణంలో ముఖ్యభూమిక పోషించారు. తెలంగాణ సమాజానికి ఆయన అందించిన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు తెలంగాణ ఫుడ్స్ చైర్మన్గా నియమించింది.