హైదరాబాద్: బతుకమ్మ, బోనాలు తెలంగాణ సంస్కతిని ప్రతిబింబిస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ పండుగల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంస్కృతి, సంప్రదాయాలు తన హృదయానికి దగ్గరగా ఉంటాయని చెప్పారు. జలవిహార్లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులని చెప్పారు.
ప్రాచీన భారతీయ నాగరికతను కాపాడుకోవాలని సూచించారు. ప్రపంచ సంస్కృతుల్లో భారతీయ సంస్కృతి విశిష్టమైనదని వెల్లడించారు. కాలనుకులంగా రుచులు-అభిరుచులు మారుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంతో సాంస్కృతిక పునర్జీవనం కల్పిస్తున్నారన్నారు. ప్రకృతితో కలిసి జీవించాలని, ప్రకృతిని కాపాడలన్నారు. కరోనా ప్రమాదం ఇంకా తొలగిపోలేదని చెప్పారు. ప్రతిఒక్కరూ కేంద్ర, రాష్ట్ర సూచనలు పాటించాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని చెప్పారు.
అంతకుముందు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలుగు వారైన భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల, రెడ్డి ల్యాబ్స్ అధినేత ప్రసాద్ రెడ్డి, ఏఐజీ దవాఖానల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్, బయలాజికల్-ఈ వైస్ ప్రెసిడెంట్ మహిమ దాట్లను ఉపరాష్ట్రపతి సన్మానించారు.