CM KCR | జోగులాంబ గద్వాల : గద్వాల జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు గుర్తు చేసుకుంటే ఒకనాడు చాలా కష్టాల్లో మునిగిపోయి పాలమూరు జిల్లా గంజి కేంద్రాలకు నిలయంగా ఉండేదన్నారు. మనకున్న ఆర్డీఎస్ కాల్వను మనకు కాకుండా జేసి గద్దల్లా తన్నుకుపోతే ఉద్యమంలో మొట్టమొదటి పాదయాత్ర చేపట్టింది నేనే. జోగులాంబ తల్లికి దండం పెట్టి గద్వాల వరకు పాదయాత్ర చేపట్టాను అని కేసీఆర్ తెలిపారు. గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం అయిజ రోడ్డులో ఏర్పటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక చోట్ల అలంపూర్, గద్వాల్, నడిగడ్డలో పర్యటించాను అని కేసీఆర్ గుర్తు చేశారు. నాడు హృదయవిదరాక దృశ్యాలు కనబడ్డాయి. కన్నీళ్లు పెట్టుకున్నాం. ఇక్కడ సభ పెడితే ప్రళయ గర్జనలాగా వచ్చారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత పరిపాలన సంస్కరణలు చేసుకున్నాం. సంస్కరణల్లో భాగంగా గద్వాల జిల్లా ఏర్పడింది. రాజభవనాలను తలపించే కలెక్టరేట్, పోలీసు భవనాలు ప్రారంభించుకున్నాం. జిల్లా ప్రజలు బాగుండాలని జోగులాంబ గద్వాల జిల్లా అని ఈ జిల్లాకు పేరు పెట్టుకున్నామని కేసీఆర్ తెలిపారు.
నెట్టెంపాడు, బీమా ద్వారా సాగునీరు అందుతుందని కేసీఆర్ తెలిపారు. గట్టు పునాదిరాయి వేసుకున్నాం. ఆ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు. ప్రజల సంక్షేమానికి పుట్టిన నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్కరికి సహాయం అందేలా ఆదుకుంటున్నాం. గురుకుల పాఠశాలలల్లో గిరిజన, దళిత, బీసీ బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. అన్నింటిని కూడా జూనియర్ కాలేజీలుగా మార్చుకున్నాం. పిల్లలు మంచిగా చదవుకుంటున్నారు అని కేసీఆర్ తెలిపారు.
ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న ఇద్దరికి ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమకారులే అని కేసీఆర్ తెలిపారు. నిరంజన్ రెడ్డి ఫీల్డ్ మీద, శ్రీనివాస్ గౌడ్ టీజీవో అధ్యక్షుడిగా ఉంటూ ఉద్యోగాన్ని లెక్క చేయకుండా ఉద్యమం చేశారు. లక్ష్మా రెడ్డి కూడా ఉద్యమంలో పని చేశారు. పాత పాలమూరు జిల్లా ఐదు జిల్లాలుగా మారింది. ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి. కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, కోయిల్సాగర్, బీమా అన్నింటిని పూర్తి చేసుకుని 15 నుంచి 24 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చుకుంటున్నాం. ఉచిత కరెంట్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం అని కేసీఆర్ వివరించారు.
కేసీఆర్ కన్నా దొడ్డుగా, ఎత్తుగా ఉన్నోళ్లు ఈ జిల్లా నుంచి మంత్రులు అయ్యారని కేసీఆర్ తెలిపారు. వారి కాలంలో ఏం జరిగిందంటే ఏం లేదు. గద్వాలలో ఉన్నవారు ప్రాజెక్టులు పూర్తి చేయించలేదు. భయంకరమైన బాధ.. 14 రోజులకు ఒకనాడు మహబూబ్నగర్లో నీళ్లు దొరికేవి. ఇవాళ మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి వంటి కార్యక్రమాలు చేసుకున్నాం. గతంలో బతుకు లేక మనం వలసపోయాం. ఇవాళ కర్నూల్, రాయిచూర్ నుంచి మన వద్దకు వలస వస్తున్నారు. పాలమూరు జిల్లాలో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడితే కరెంట్ రాదు అని మాట్లాడారు. తుంగభద్ర బ్రిడ్జి దాటితే 24 గంటల కరెంట్ లేదు. ఆ విధంగా చాలా బ్రహ్మాండమైన పనులు చేసుకున్నాం అని కేసీఆర్ తెలిపారు.