బంజారాహిల్స్, ఆగస్టు 14: వివిధ కారణాలతో దెబ్బతిన్న కార్నియాల స్థానంలో వాడేందుకు తొలిసారిగా 3డీ ప్రింటెడ్ కృత్తిమ మానవ కార్నియాను బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ, సీసీఎంబీ శాస్త్రవేత్తలు, ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు.
ఎల్వీ ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు డా క్టర్ నయన్ బసు, డాక్టర్ వివేక్సింగ్ పరిశోధన వివరాలను ఆదివారం మీడియాకు వెల్లడించారు. మానవ దాత నుంచి సేకరించిన కార్నియల్ టిష్యూను ఉపయోగించి 3డీ ప్రింటెడ్ కార్నియాను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. సింథటిక్, జంతువుల అవశేషాలు లేకుండా రూపొందించిన కార్నియాను కుందేలు కంట్లో అమర్చినట్టు తెలిపారు. యుద్ధాల్లో కంటి కార్ని యా దెబ్బతినడం, ఇన్ఫెక్షన్లతో కార్నియాలను మార్చాల్సి ఉంటుందని, అలాంటి వారికి 3డీ ప్రింటెడ్ కృత్తిమ కార్నియా ద్వారా కంటిచూపును ప్రసాదించవచ్చని చెప్పారు. ప్రస్తుతం కుందేలు కంటిలో అమర్చిన కృత్తిమ కార్నియాలకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని వారు వివరించారు.