హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : వినువీధిలో నేడు (మంగళవారం) చంద్రగ్రహణం కనువిందు చే యనున్నది. ‘బ్లడ్ మూన్’గా పిలిచే ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు హైదరాబాద్ వా సులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికోసం బిర్లా ప్లానిటోరియం, ఓయూ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ‘బ్లడ్ మూన్’ దశ ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ర్టాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత దీన్ని చూడొచ్చు. దేశంలోని చాలా ప్రాంతాల్లో 7 నుంచి 25 నిమిషాలపాటు దీన్ని చూసేందుకు వీలుంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
భూమి నీడ చంద్రునిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూ వాతావరణం సూర్యకాంతిని వక్రీకరించి కేవలం ఎరుపు రంగు కిరణాలను మాత్రమే చంద్రునిపైకి ప్రసరింపజేస్తుంది. దీనివల్ల చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాడు. దీనినే ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. ఎలాంటి కండ్లజోడు, ఇతర రక్షణ పరికరాలు అవసరం లేకుండా నేరుగా దీన్ని చూడొచ్చని, మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జులై 6న ఏర్పడే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు.