సిద్దిపేట, జూలై 24 : హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోఎల్అండ్టీ కన్స్ట్రక్షన్ కంపెనీ, న్యాక్ సంయుక్త ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల కోసం శిక్షణా శిబిరాన్ని 3 నెలల్లో ప్రారంభించనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. పనిలో మెలకువలు, నైపుణ్యత మెరుగుపర్చుకొనేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఏటా 300 మందికి శిక్షణ ఇవ్వనున్నామని, రూ.5 కోట్లతో దీన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఆదివారం సిద్దిపేటలోని కొండాభూదేవి గార్డెన్లో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు. మొదటి విడతగా లక్ష మంది కార్మికులకు సబ్సిడీ ద్వారా మోటర్ సైకిళ్లు అందించనున్నట్టు పేర్కొన్నారు.
కార్మిక బోర్డులో సభ్యులుగా ఉన్న వారికి వైకల్యం ఏర్పడితే ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వ కృషితో రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం జోరు మీదున్నదని, తద్వార భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరిగినట్టు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ఉమ్మడి రాష్ట్రంలో కార్మిక బీమా రూ.3 లక్షలు ఉంటే, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ దాన్ని రూ.6 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. కార్మికుడు సాధారణంగా చనిపోతే గతంలో రూ.30 వేలు ఆర్థిక సాయం చెల్లిస్తే, ప్రస్తుత ప్రభుత్వం రూ.1.30 లక్షలకు పెంచిందన్నారు. సభ్యత్వం కలిగిన కార్మికుడి కుటుంబంలో పెండ్లికి రూ.30 వేలు, భవన నిర్మాణ కార్మికుల ప్రసూతి ఖర్చుల కోసం రూ.30 వేలు ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో బీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రం, కార్యదర్శి సారంగపాణి, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్రెడ్డి, సెంట్రింగ్ సంఘం అధ్యక్షుడు నర్ర రవీందర్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.