హైదరాబాద్, జూలై 20 ( నమస్తే తెలంగాణ): లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తులపై కదిలిక మొదలైంది. గత ఏడాది ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం అవకాశం కల్పించగా.. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. తాజాగా.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను గ్రామ పంచాయతీలు, కాలనీలు, ఆయా ప్రాంతాల ప్రాతిపదికన క్లస్టర్ల వారీగా విభజించాలని జిల్లా కలెక్టర్లను మున్సిపల్శాఖ ఆదేశించింది. దరఖాస్తులను పరిశీలించడానికి వివిధ శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటుచేయాలని పేర్కొన్నది. ఈ బృందంలో రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉండేలా చూడాలని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారి భూములను ఈ బృందం తనిఖీ చేసి కలెక్టర్కు, సంబంధిత కమిషనర్కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. తనిఖీ సమయంలో ఎల్ఆర్ఎస్కు అర్హత ఉన్నవి, అర్హత లేనివి, వాటి సమగ్ర వివరాలను బృందం సభ్యులు ఆన్లైన్లో సమర్పించాలి. కలెక్టర్లు, కమిషనర్లు.. ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ప్రక్రియనంతా జిల్లా కలెక్టర్లు 15 రోజుల్లో పూర్తిచేయాలని అర్వింద్కుమార్ ఆదేశించారు.