హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తేతెలంగాణ) : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ర్టాల్లో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతోపాటు గురువారం నైరుతి బంగాళాఖాతంలో ప్రతి ఆవర్తనం కొనసాగుతున్నదని తెలిపింది.
ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నట్టు పేర్కొంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 31 డిగ్రీల వరకు, రాత్రి ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది.