ఎంబీఎస్ గ్రూప్ డైరెక్టర్పై ఈడీ కేసు సరైనదే: హైకోర్టు
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): బంగారం దిగుమతుల్లో ఎంఎంటీసీకి రూ.194 కోట్ల మేరకు నష్టం చేకూర్చారని ఎంబీఎస్ గ్రూప్ డైరెక్టర్ సుఖేష్గుప్తాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు సమర్థించింది. 2014లో ఈడీ పెట్టిన కేసును కొట్టేయాలని గుప్తా దాఖలు చేసిన రిట్ను డిస్మిస్ చేస్తూ జస్టిస్ షమీమ్ అక్తర్ ఇటీవల తీర్పు వెలువరించారు. ఎంఎంటీసీలోని కొందరు అధికారుల కారణంగా రూ.194 కోట్లు నష్టం కలిగినట్టు సీబీఐ కేసు నమోదు చేసిందని, దీనిపై ఈడీ కేసు నమోదు చేయడం సమర్థనీయమేనని హైకోర్టు తేల్చింది. ప్రాథమిక దశలో ఉన్న కేసులో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ఈడీ నోటీసు ఇస్తే దర్యాప్తునకు హాజరై నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పింది. దర్యాప్తునకు హాజరుకాకుండా ఈడీ కేసు కొట్టేయాలని కోర్టుకు రావడం సరికాదని తీర్పులో పేరొన్నది.