శాస్ర్తోక్తంగా దివ్య విమాన రథోత్సవం
యాదాద్రి, మార్చి 12 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శనివారం ఉదయం లక్ష్మీనాథుడైన స్వామివారు విష్ణుమూర్తి అలంకారంలో గరుత్మంతుడిపై శ్రీమహాలక్ష్మీ సమేతంగా ఊరేగారు. అర్చక బృందం, వేద పండితులు, వేద పారాయణీకులు వేదోక్త పఠనాలు, ఆస్థాన విద్వాంసులు మంగళవాయిద్యాల నడుమ అలంకార సేవ నేత్రపర్వంగా సాగింది. సాయంత్రం బాలాలయంలో స్వామివారి దివ్య విమాన రథోత్సవం దాతల సహకారంతో ముస్తాబైన స్వర్ణ రథంపై అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన నిర్వహించనున్నారు.
విమానగోపురం స్వర్ణతాపడానికి 1.66 లక్షల విరాళం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి దాతల సహకారం కొనసాగుతున్నది. యాదగిరిగుట్ట మండలం రామాజిపేటకు చెందిన ఆలయ మాజీ ధర్మకర్త కల్లూరి బాల్రెడ్డి రూ.1.16 లక్షలు, హనుమకొండకు చెందిన బుర్రా శ్రీనివాస్ రూ.50,200 విరాళాన్ని సమర్పించారు. ఇందుకు సంబంధించిన చెక్కు, నగదును శనివారం వారు వేర్వేరుగా యాదాద్రి బాలాలయంలో ఈవో ఎన్ గీతకు అందజేశారు.