యాదాద్రి, జూలై 27: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి బుధవారం సాయంత్రం విహార (జోడు) సేవను అర్చకులు వైభవంగా జరిపారు. స్వామివారిని గరుడవాహనంపై, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ప్రధానాలయంలో ఊరేగించారు. అనంతరం స్వామివారికి దర్బార్ సేవ నిర్వహించారు.
నాలుగు వేదాలు పారాయణం చేసి, స్వస్తి మంత్రార్థాలను పఠిస్తూ స్వామివారిని శాంతింపజేశారు. తిరువారాధన, సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన జరిపించారు. స్వామి వారిని 6 వేల మంది భక్తులు దర్శించుకోగా, ఖజానాకు రూ.8,08,492 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.