Sugar Price | మొన్న:గోధుమల ఎగుమతులపై నిషేధం
నిన్న: బియ్యం ఎగుమతులపై బ్యాన్
మరి ఇప్పుడు?
ఈ నిషేధిత జాబితాలో తాజాగా చక్కెరను కూడా చేర్చే సమయం వచ్చినట్టే కనిపిస్తున్నది. దేశంలో ఆహారభద్రత సంక్షోభంలో పడిందనడానికి ఇంతకంటే మరో రుజువు ఏంకావాలి?!
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రస్తుత దుస్థితిని చూస్తే పేద, మధ్యతరగతి జీవికి బుక్కెడన్నం కూడా తినడం కష్టంగానే మారినట్టు కనిపిస్తున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు అసమర్థ, ముందుచూపు లేని విధానాల కారణంగా ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకొని బియ్యం, గోధుమలు, నూనె, పాలు, పప్పు ఇలా ప్రతీ నిత్యావసర వస్తువు ధర ఆకాశాన్నంటుతున్నది. గిడ్డంగుల్లో ధాన్యం నిల్వలు అడుగంటిపోవడంతో ఆలస్యంగా మేల్కొన్న కేంద్రం గోధుమలు, ఆ తర్వాత బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఈ జాబితాలో చక్కెర కూడా చేరనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
దిగుబడిపై ప్రభావం
నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలో ఈసారి ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ, చెరుకు పంట ఎక్కువగా పండే మహారాష్ట్ర, కర్ణాటకలో తగినంతగా వర్షపాతం నమోదవ్వలేదు. దీంతో చెరుకు సాగు ఆశించినంత స్థాయిలో జరుగలేదు. మహారాష్ట్రలో చక్కెరకు అడ్డాగా పిలిచే పుణె జిల్లాలోని డ్యామ్లలో 19 శాతం కూడా నీటి నిల్వలు లేవు. దీంతో ఈ ప్రభావం చెరుకు దిగుబడిపై విపరీతంగా పడొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కిందటేడాది కంటే చెరుకు దిగుబడి మరింత తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. బియ్యం ఎగుమతులపై విధించిన ఆంక్షలు దేశంలో ఆహార భద్రత, ద్రవ్యోల్బణం పట్ల కేంద్రం ఆందోళనలకు సంకేతమని షుగర్ అండ్ ఇథనాల్ ట్రాపికల్ రిసెర్చ్ సర్వీసెస్ హెడ్ హెన్రీక్ అకమైన్ అన్నారు. త్వరలో చక్కెర ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించవచ్చని అంచనా వేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో గత జూన్లో వర్షపాతం తక్కువగా నమోదైందని, ఇది చెరుకు సాగుపై ప్రభావం చూపినట్టు ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదిత్య జున్జున్వాలా అన్నారు. ఈ ఏడాది చక్కెర ఉత్పత్తి 3.4 శాతం మేర తగ్గొచ్చని అంచనా వేశారు. కాగా, చక్కెర కొరత వార్తలు సామాన్యులను భయపెడుతున్నాయి. మార్కెట్లో ఇప్పుడే కృత్రిమ డిమాండ్ను సృష్టించి వ్యాపారులు చక్కెర రేట్లను అమాంతం పెంచవచ్చని పలువురు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.